అయ్యకోనేరుగట్టు

Writer: Shri Jayanti Prakash Sarma, Retd SBI Staff

పేరుకి కామేశ్వరమ్మ గారే, కాని దొడ్డమ్మ గారంటేనే ఆ గట్టుకి తెలిసేది. చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ ఆవిడ్ని దొడ్డమ్మగారనే పిలుస్తారు. గంగభగీరధీ సమానురాలైనా కామేశ్వరమ్మగారు అంచున్న తెల్ల చీరాని అడ్డగచ్చగా కట్టుకుని చూడ్డానికి చాల హుందాగా ఎప్పుడూ చిరునవ్వు మొహంతోనే ఉండేవారు. ఆవిడకి ముప్పై సంవత్సరాలకే వైధవ్యం రావడంతో పుట్టింటి పంచ చెరింది. పాపం కామేశ్వరమ్మగారికి పిల్లలు కూడా లేరు. ఆవిడితో పాటు అప్పటికే ఆవిడ చెల్లెలూ భర్త ఇద్దరూ పోవడంతో వాళ్ళ ఐదుగురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల భారం కూడా తాతా అమ్మమ్మల మీదే పడింది.

‘ఎంచేస్తాం.. అంతా వాడి లీల’ అని అనుకుని ముందుకు నడిచారే గాని గుండెలు బాదిసుకోలేదు. ఆ ముసిలవాళ్ళకి ఉన్న ఆస్తంతా ఆ గట్టుమీదున్న రెండు వాసలిల్లే. వెనకవాసలో ఉన్న దేవుడిల్లు, వంటిల్లల్లోనే అమ్మమ్మగారు జీవితాన్ని , స్వర్గాన్ని చూస్తూఉంటారు. ఆవిడకి ఉదయం నాలుగు గంటలకే తెల్లరెది. దేవుడింట్లో ఓ గంట పూజచేసి. ఐదుగంటలకు వంటింట్లోకివేలితే మళ్ళీ మధ్యాహ్నం పదకొండు గంటల వరకు బయటకువచ్చిన దాఖల్లేవనే చెప్పాలి. ముందులో కర్రలపోయ్యిమీద వంట చేసెది. దానితో సాగలేక బోగ్గులకుంపటికి మారింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాతకూడా అక్కడే దేవుడింటిగుమ్మంమీద తల పెట్టుకుని కాస్సేపు నడుం వాల్చేవారు. సాయంత్రం ఎప్పుడైనా వీధి అరుగుమీద కూర్చుని వచ్చిపోయేవాళ్ళని పలకరించి యెగక్షేమాలని అడిగి వాళ్ళ కష్టం సుఖం పంచుకొనేది. తాతాగారికి అప్పటికే ఎనబై సంవత్సరాల పైబడ్డ వయస్సు. ఉదయం , సాయంత్రం ఆ వీధి చివరవరకు వాహ్యళిగా వెళ్ళి ఓ నలుగురిని పలకరించటమే ఆయన దినచర్య. మిగతా సమయంలో ఇంటిపట్టునే రేడియో పట్టుకుని కూర్చునేవారు. ఆయనికి కాస్తా వినికిడి, కంటిచూపు సమస్యలు కూడా ఉండేవి. అందుకే మామ్మగారే ఇంటికి ఎవరైనా వస్తే సమాధానం చెప్పేవారు.

“ఎంటో మామ్మగారు ఈ వయసులో మీకిన్ని కష్టలు” అంటూ ఎవరైనా సానుభూతితో మాట్లాడితే

“అదేమిటే కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? ఇంకా ఆ పిల్లల అదృష్టం బావుండీ మేం ఇంకా బతికే ఉన్నాం. లేకపోతే ఆ చిన్నపిల్లలు, మా పెద్దపిల్ల పరిస్థితి ఎలా ఉండేదో. అయినా నారుపోసినవాడు నీరు పోస్తాడులే తల్లీ ” అంటూ కొంగుతో కళ్ళు ఒత్తుకునెది.

గుడ్డిలో మెల్లలా ఆమధ్య దాయాదుల ఆస్తి పంపకాలలో కామేశ్వరమ్మగారికి ఆ గట్టుమీదే ఉన్న ఓ రెండు వాసల ఇల్లు రావటం కొంత ఊరట కలిగింది. దానిమీద కొద్దిపాటి అద్దే వేడి నీళ్ళకి చన్నీళ్ళులా అనిపించింది. ఇక తల్లిదండ్రులు వయస్సు మీరడంతో ఆ సంసార బాధ్యతలని కామేశ్వరమ్మగారే తీసుకున్నారు. పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుని అడుగుపెట్టిన దగ్గర్నుంచీ కామేశ్వరమ్మ గారిని దొడ్డమ్మ అంటూ పిల్లలుకూడా చేరువయారు. అదిగో అప్పట్నుంచి కామేశ్వరమ్మ గారి పేరు మరుగునపడి దొడ్డమ్మగారిగా చలామణి అయిపోయారు. తన వంశం అక్కడితో అంతం కాకుడదనే ఉద్దేశంతో దొడ్డమ్మగారు చెల్లిపిల్లలలో మధ్యవాడ్ని దత్తత చేసుకున్న సరే అందర్ని ఒకేలా చూసుకుంటూ తల్లిలేని లోటు కనబడకుండా పెంచి పెద్దచేసారు. నాలుగైదు నెలలకోసారి చోడవరంలోఉన్నా తన పుట్టింటి బంధువుల ఇంటికి వెళ్ళివస్తూఉండేది. అంతకుమించి బంధువులు కూడా ఎక్కడా లేరు. ఇక బంధువులైనా బంధాలైనా అయ్యకోనేరుగట్టేకదా అని ఆనందంగానే సరిపెట్టుకున్నారు.

“దొడ్డమ్మగారు మాఅబ్బాయికి వచ్చే నెలలో ఉపనయనం చేస్తున్నాం. చక్కిలాలు, అరిసాలు ఉండాలిటగా. అవి ఎలా చేస్తారో మాకెవ్వరికి తెలియదు.. కాస్త ఆ ఉపకారం మీరే చెయ్యాలి.” అంటూ ఎవరడిగినా సరే

“అదేం బాగ్యమేతల్లీ. ఓ రెండురోజులముందు మీ ఇంటికోచ్చి చేసిపెడతానులే. మీరు మిగత పనులు చూసుకొండి” అంటూ అభయం ఇచ్చేవారు.

“ఇదిగో అమ్మాయి. వాడికి ఉపనయనం చేస్తే చేసారుగాని, పెళ్ళి గట్రా అంటూ వాడ్ని సతయించకండి. వాడి చదువు పూర్తికావాలీ, ఉద్యోగం రావాలి, అందులో స్దిరపడాలి, అప్పుడు పెళ్ళి చేయాలి. అంతేగాని ఎదో ఆ పనయిపోతుందని పెళ్ళి చేయటం మంచిదికాదు తల్లీ” అంటూ హితవు కూడా చెప్పేది.

అలా గట్టు మీదందరికి తలలో నాలుకలా అలవాటైపోయారు. ‘పోయినవాళ్ళగురించి బెంగపెట్టుకుని కుంగిపోవటంకన్నా అందర్ని ఆప్యాయంగా కలుపుకోవడమే జీవితం’ అన్నదే నిజమని నమ్మేరు దొడ్డమ్మగారు.

దొడ్డమ్మగారికి పెద్దామ్మాయి స్కూల్ ఫైనల్ పరిక్షలు అయిపోయేవరకు ఏమి అనిపించలేదు గాని “వీళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలికదా” అనే ఆలోచన వచ్చెసరికి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు అందరిలో పెద్దవాడు ప్రసాద్ స్కూలుఫైనలవటంతోనే కడపలో గవర్నమెంటు ఉద్యోగం వచ్చి అక్కడకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి స్వరూపం ఆ ఎడాది స్కూలుఫైనల్ పరిక్షలు రాసింది. అంతకంటే పెద్ద చదువులు చదివించడానికి స్తోమత లేదు. ఇప్పటి వరకు ఏదో గట్టెక్కిందిగాని ఇప్పుడెలా అన్న ఆలోచనలు దొడ్డమ్మగార్ని వేదించసాగాయి. దానికితోడు ఈమధ్య తండ్రి కూడా మంచం పట్టడంతో దొడ్డమ్మగారికి కొంచెం భయం పట్టుకుంది. తల్లిదండ్రులు లేని పిల్లలంటే సంబంధాలు అంత తొందరగా దొరుకుతాయా? పెళ్ళికొడుకులకు సవాలక్ష కొరికలు, ప్రశ్నలు ఉంటాయి.

“నువ్వా ఆలోచనలతో బెంగ పెట్టుకోకమ్మా. సమస్యలు ఇవాళ మనకేం కొత్తకాదు. మన వంశానికి ఎప్పుడూ సమస్యలు, కష్టాలే తల్లీ. వాటిని ఎదుర్కొని మన తాతలు తండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసారుగా. మనం కూడా అలాగే వాటిని ఎదురుకోవాలిగాని, డీలా పడిపోకుడదమ్మా. మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఆపైన భగవంతుడిమీద భారం వెయ్యడమే.” అంటూ తల్లి హితబోధ చేయటంతో దొడ్డమ్మగారికి కొంచెం ధైర్యం వచ్చింది . కాని ‘ఎలా’ అనే ప్రశ్న అలా బుర్రని దొలుస్తూనేఉండేది. ..

ఇప్పటి వరకు ఆ ఇంటి మీదొచ్చే అద్దె, తనకొచ్చె ఫించను డబ్బులతో ఇల్లు గడిచిపోయింది . ఇక పెద్దాబ్బాయికి ఉద్యోగం రావటం, వాడు జీతాలు అందుకోగానే డబ్బులు పంపుతుండటంతో అర్ధికంగా కూడా కొంచెం స్ధిమతపడ్డంతో దొడ్డమ్మగారికి కాస్తా ధైర్యం వచ్చింది. స్కూల్ ఫైనల్ రిజల్స్ రావటం, అందులో స్వరూపం పస్టుక్లాసులో పాసుకావటం మరీంత ఊరట కలిగించింది.

“దొడ్డమ్మగారు చూశారా. ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి వార్తలే. స్వరూపాం ఫస్టు క్లాసులో పాసైయిందిగా. అలా పాసైనవాళ్లకి సెంట్రల్ గవర్నమెంటులో నేరుగా ఉద్యోగం ఇచ్చేస్తారుట. ఓ అప్లికేషన్ని పెట్టమనండి” అంటూ వీధిలో వాళ్ళందరూ వచ్చి ఆనందం వ్యక్తపరచారు. దానితో స్వరూపం ఆ ప్రయత్నలలో పడింది.

“వేళా విశేషం కాకపోతే ఎమిటీ.. ఆరోజు మీరిచ్చిన సలహా ప్రకారం స్వరూపం ఓ ఆర్జీ పెట్టుకుంది. నెల తిరక్కుండానే టెలిఫోన్ల ఆఫీసులో ఉద్యోగంలో చేరమంటూ ఉత్తరం వచ్చిందిర్రా. అందుకే మీ నోరు తీపి చెద్దామనీ సున్నుండలు చేసాను. ఇవి తిని ఇలాంటి తియ్యని మాటలు పదికాలలపాటు చెపుతూ ఉండండి” అంటూ దొడ్డమ్మగారు గట్టాంత సంబరంగా తిరిగడారు.

స్వరూపం ఉద్యోగంలో చేరటం, రెండు జీతాలు అందుకోవాటం ఇట్టే గడిచిపోయాయి. దొడ్డమ్మగారు అలోచనలు మళ్ళీ మెదటికొచ్చాయి. దానికితోడు ఇప్పుడు స్వరూపం సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగస్తురాలుకదా. అంతకంటే ఓ పెద్దద్యోగస్తుడ్ని చూడాలి. ఎలాగో ఏమిటో … అన్న. అందోళన ఆవిడ్ని వేంటాడుతూనే ఉంది. మరో నెల గడిచింది. శ్రావణమాసం అడుగుపెట్టింది. ఎందుకైనా మంచిదని ఆ గట్టుమీదే ఉన్న నరసింహంగారికింటికేళ్ళి స్వరూపం నక్షత్రం, రాశి చెప్పి “బాబయ్యగారు మా స్వరూపం జాతకం చూసి దానికి వివాహయోగ్యం ఎప్పుడో కాస్తా చెపుదురు” అంటూ ఆ ప్రయత్నంకూడా చేసింది.

“స్వరూపానికేవమ్మా… జాతకం మహ బేషుగ్గా ఉంది. తొందర్లోనే కళ్యణగడియాలు వస్తాయమ్మా” అంటూ రెండు నిమిషాలలో తేల్చిపారేసారు. దాంతో దొడ్డమ్మగారికి ఊరటకలిగిందే గాని కార్యరూపం దాల్చిన పరిస్ధితులు ఎదురుకాలేదు. ఉన్నట్టుండీ ఓ రోజు స్వరూపం “దొడ్డ.. రేపు మా ఆఫీసువాళ్ళందరు కలసి సింహచలం వెళ్తున్నారు. ఎల్లుండి ఆఫీసుకి శెలవు. ఆ రాత్రికి వచ్చేస్తారుట. సింహచలం నేనెప్పుడూ చూడలేదుగా… నేను వేళ్తాను దోడ్డా” అంటూ ప్రాధేయ పడిసరికి దొడ్డమ్మగారికి వద్దని చెప్పలానిపించలేదు.

మర్నాడు ఉదయమే స్వరూపం సింహచలం వెళ్ళింది. ఆ రోజు దొడ్డమ్మగారు మాత్రం అన్యమస్కంగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఆ సాయంత్రం దొడ్డమ్మగారు “చోడవరం వెళ్ళొస్తాన్నర్రా” అంటూ బయలుదేరారు.

రాత్రి ఎనిమిదైయింది. సింహచలదేవస్ధాన మండపం పిట్లమీద కూర్చున్న స్వరూపం దొడ్డమ్మని చూస్తూనే ఒక్కసారి గతుక్కుమంది. వళ్లంతా చెమటలు పట్టిసాయి. నోటంటా మాటకూడా రాలేదు.

అయితే దొడ్డమ్మగారిలో కంగారు కనబడలేదు. చిరునవ్వుతో ఎప్పటిలాగే ఉన్నారు.

“పిచ్చిపిల్లా నేనేం కాదంటానా. నేనయితే చదువుకొలేదుకాని నువ్వు చదువుకున్నావు. మంచిచెడ్డ అన్ని నీకు తెలుస్తాయి. నాకానమ్మకం ఉందమ్మా” అంటూ ఒక్కసారి ఊపిరి తీసుకుని తనతో తెచ్చుకున్న మరచెంబులోని నీళ్లు తాగుతూ క్రీకంటా స్వరూపం పక్కనున్న పెళ్ళికొడుకుని చూసి సంతృప్తిగా మంచినీళ్ళు తాగటం ముగించింది. ఏం మాట్లడాలో ఏం చేయ్యాలో అక్కడున్న పదిపదిహెనుమందికి తట్టలేదు. ఆవిడ ఏల స్పందిస్తారో అని అందర్లో ఒకటే గుండెదడలు. అంతట నిశ్శబ్దం ఆవరించింది. రెండు నిమిషల తర్వాత దొడ్డమ్మగారే అన్నారు.

“మీఅందరిని పెంచి పెద్దచేయటం, పేళ్ళల్లు చేయటం ఓ బరువు బాధ్యతలుగా నేనేప్పుడూ అనుకోలేదమ్మా. నాజన్మకి అవో వరాలుగానే భావించాను. మీ అయిదుగుర్ని పెంచి, పెద్దచేసి అక్షింతాలు వేసే బాగ్యం మీ అమ్మనాన్నలకి దక్కలేదుగాని, అన్ని కొల్పోయిన నాకిచ్చాడమ్మా ఆ భగవంతుడు. అందులో బంగారంలాంటి మొదటవకాశాన్ని వదులుకుంటానా తల్లీ.” అంటూ తన కాళ్ళపై మొకరిల్లిన స్వరూపాన్ని దగ్గరకి తీసుకుంటూ అన్నారు.

ఉబికొస్తున్న కన్నీటిని తుడుచుకోడానికి ఆవిడచేతుల్లో చీరకొంగులేదు. అక్కునచేరిన కొత్తదంపతులున్నారు.

దొడ్డమ్మగారి దొడ్డమనసు వాళ్ళకేకాదు.. అక్కడికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న అయ్యకోనేరుగట్టుక్కూడా కొట్టొచ్చినట్టు కనబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *